Paritala Sunita: "రేయ్... ఇక్కడే ఉంటే తంతా"... పిల్లాడికి పరిటాల సునీత వార్నింగ్!

  • 'అన్న క్యాంటీన్'ను తనిఖీ చేసేందుకు వెళ్లిన పరిటాల సునీత
  • ప్లేట్లు అందిస్తూ కనిపించిన బాల కార్మికుడు
  • బడికి పోలేదా? అంటూ పలకరించిన సునీత
  • బాలలను పనిలో పెట్టుకోవద్దని నిర్వాహకులకు హెచ్చరిక

అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన 'అన్న క్యాంటీన్'ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వెళ్లిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని పలకరించారు.

ఆపై "ఏరా... బడికిపోలేదా? ఇక్కడే ఉంటే తంతా" అంటూ వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకోవద్దని క్యాంటీన్ నిర్వాహకులను హెచ్చరించారు. ఆ తరువాత ఐదు రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకుని, అందరితోపాటు భోజనం చేశారు. అక్కడికి వచ్చిన వారికి కాసేపు అన్నం వడ్డించారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ క్యాంటీన్ లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, పేదల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. క్యాంటీన్లకు వచ్చే వారిని గౌరవంగా చూసుకోవాలని నిర్వాహకులకు పరిటాల సునీత సూచించారు.

More Telugu News