Foetus: చేతిలో ఐదు నెలల పిండంతో పోలీస్ స్టేషన్ కు యువతి... ప్రియుడు మోసం చేస్తున్నాడని ఫిర్యాదు!

  • పెళ్లికి నిరాకరించిన ప్రియుడు
  • బలవంతంగా గర్భస్రావం మాత్రలు మింగించిన వైనం
  • అబార్షన్ తరువాత, పిండం తీసుకుని స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు

ప్రేమించిన వాడు మోసం చేయడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చిందో యువతి... మామూలుగా అయితే, ఇటువంటి ఘటనలు నిత్యమూ కనిపిస్తుంటాయి. కానీ, ఈ యువతి అలా కాదు. ప్రియుడిపై ఫిర్యాదు చేసేందుకు చేతిలో ఐదు నెలల మృత పిండాన్ని తీసుకుని వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ పరిధిలోని అమ్రోహా సమీపంలో జరిగింది.

 మరిన్ని వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు బాధితురాలిని వివాహం చేసుకుంటానని మాయమాటలు చెప్పి  గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. తనకు గర్భం వచ్చిందని, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆమె డిమాండ్ చేయగా, తప్పించుకుని తిరగడం ప్రారంభించాడు. ఆమె మరింతగా ఒత్తిడి తేవడంతో గర్భస్రావం మాత్రలు తెచ్చి బలవంతంగా మింగించాడు.

దీంతో ఆమెకు అబార్షన్ అయింది. తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను, అబార్షన్ చేయించాడని చెబుతూ, అందుకు సాక్ష్యం ఇదిగో అంటూ ఓ కవర్ లో అబార్షన్ అయిన పిండాన్ని పెట్టుకుని పోలీసుల వద్దకు వచ్చింది బాధితురాలు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News