Jagan: జగన్ వీధుల్లో.. పవన్ ‘ట్విట్టర్’లో ఉన్నారు!: ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి

  • రాష్ట్రాభివృద్ధిపై జగన్, పవన్ లకు అవగాహనే లేదు
  • లోక్ సభలో ప్రధాని మోదీ అసత్యాలు మాట్లాడారు
  • యూటర్న్ తీసుకుంది చంద్రబాబు కాదు మోదీ

వైసీపీ, జనసేన పార్టీల అధినేతలపై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి విరుచుకుపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధిపై జగన్, పవన్ లకు కనీస అవగాహన కూడా లేదని, జగన్ వీధుల్లో తిరుగుతుంటే, పవన్ ‘ట్విట్టర్’ ద్వారా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

రెండు రోజుల క్రితం లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేశారని, చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని అనడం అన్యాయమని అన్నారు. అవాస్తవ హామీలతో తమను మోసగించి ఇలా విమర్శించడం దారుణమని, యూటర్న్ తీసుకుంది చంద్రబాబు కాదు మోదీ అని మండిపడ్డారు.

ఏపీ ప్రయోజనాల కోసం తమ ధర్మపోరాటం ఆగదని, ఇచ్చిన హామీలు నెరవేరే వరకు తాము పోరాడుతూనే ఉంటామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంత దూరమైనా వెళతామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు.

More Telugu News