sanjaydutt: మమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారా?: రాంగోపాల్ వర్మపై సంజయ్ దత్ సోదరి మండిపాటు

  • సంజయ్ పై మరో బయోపిక్ తీస్తానన్న వర్మ
  • అక్రమాయుధాల కేసు నేపథ్యంగా ఉంటుందని ప్రకటన
  • దీనిపై మండిపడ్డ నమ్రతా దత్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా ‘సంజు’ బయోపిక్ ఇటీవల విడుదలైంది. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. ఇదిలా ఉండగా, సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కిస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య ప్రకటించారు. సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసు నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని కూడా వర్మ క్లూ ఇచ్చారు. అసలు, సంజయ్ దత్ వద్దకు ఏకే-56’ రైఫిల్ ఎలా వచ్చింది, అందుకు దారి తీసిన పరిస్థితుల గురించి తాను తెరకెక్కించే చిత్రంలో వివరంగా చూపిస్తానని వర్మ ప్రకటించారు.

ఈ ప్రకటనపై సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ మండిపడ్డారు. అక్రమాయుధాల కేసు అనేది సంజయ్ జీవితంలో ఓ బాధాకరమైన ఘటన అని, దీని గురించి వర్మ ఎందుకు తీయాలనుకుంటున్నారని మండిపడ్డారు. వర్మ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలేనని, సంజయ్ ను బాధపెట్టాలనుకుంటున్నారా? మమ్మల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని చూస్తున్నారా? అంటూ వర్మపై సంజయ్ సోదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, తన సోదరుడికి ఈ విషయమై ఎటువంటి అభ్యంతరం లేకపోతే వర్మ ప్రయత్నాలకు తాము అడ్డుతగలబోమని అన్నారు.

More Telugu News