Chandrababu: ప్రధాని స్థానంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడతారా?: చంద్రబాబు

  • నేను 1995లో సీఎం అయితే, మోదీ 2002లో అయ్యారు
  • కేసీఆర్ తో ఇబ్బంది లేదు, నాతోనే ఇబ్బంది అంటారా?
  • యూటర్న్ తీసుకుంది నేను కాదు.. మీరే

ప్రత్యేక ప్యాకేజీకి తాను ఒప్పుకున్నానని మోదీ చెప్పారని... ప్యాకేజీకి తాను ఎప్పుడూ ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కూడా ఆ సాయాన్ని ఆపేయాలనుకుంటున్నామని, హోదాకంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారని, ఆ తర్వాత 11 రాష్ట్రాలను హోదాను కొనసాగించారని మండిపడ్డారు. ప్రత్యేక నిధుల కోసం లేఖ ఇవ్వాలని ఒకసారి, స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా నిధులు ఇస్తామని మరోసారి, ఇలా కథలు చెప్పుకుంటూ వచ్చారని విమర్శించారు.

హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, హైదరాబాదుకు ఒక అందమైన రూపం ఇచ్చిందని తానేనని చంద్రబాబు చెప్పారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు హైదరాబాదు నిలవడం పట్ల తాను ఎప్పుడూ గర్వపడతానని తెలిపారు. హైదరాబాదులోని ఆస్తులను తాను ఎన్నడూ అడగలేదని, న్యాయం చేయాలని మాత్రమే కోరానని చెప్పారు. హైదరాబాదు రూపంలో తాము కోల్పోయిన దాన్ని భర్తీ చేయాలని మాత్రమే తాను కోరానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో ఏపీ ప్రజలు విసిగిపోయారని చెప్పారు. ఏపీ ప్రజల దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్ తో ఇబ్బంది లేదు, ఇబ్బందులన్నీ చంద్రబాబుతోనే అని మోదీ అనడం హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు ఎవరైనా ఇలా మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు. మీ అందరికంటే ముందుగానే తాను సీఎం అయ్యాయని చెప్పారు. మోదీ 2002లో సీఎం అయితే, 1995లోనే తాను ముఖ్యమంత్రి అయ్యానని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా మోదీ ఏం సాధించాలనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని విమర్శించారు. తానే ఇబ్బందులు కలిగిస్తున్నానని మోదీ అన్నారని... ఇద్దరు ముఖ్యమంత్రులతో కలసి మోదీ కానీ, గవర్నర్ కానీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని అన్నారు. అయినప్పటికీ, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

తాను యూటర్న్ తీసుకున్నానని మోదీ అన్నారని... యూటర్న్ తనది కాదు మీదే అని చంద్రబాబు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మీరే యూటర్న్ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలో వైసీపీని మధ్యలోకి లాగే ప్రయత్నం చేశారని అన్నారు. నిన్న పార్లమెంటులో తమ పార్టీ ఉంటే, వైసీపీ అధినేత కోర్టులో ఉన్నారని ఎద్దేవా చేశారు. అత్యున్నతమైన ప్రధాని స్థానంలో ఉంటూ, ఇలాంటి విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. 

More Telugu News