Chandrababu: కళంకితులతో కలసి ఉన్నది మీరు.. అలాంటి వారితో నన్నెలా పోల్చుతారు?: మోదీపై చంద్రబాబు ఆగ్రహం

  • వైసీపీ ట్రాప్ లో పడుతున్నారని మోదీ నాతో చెప్పారు
  • నేను కరెక్ట్ గా ఉన్నంత కాలం నాకేమీ కాదని చెప్పాను
  • ఏడాదిలోగా అక్రమార్కులను కటకటాల వెనక్కి పంపుతానని చెప్పారు... ఇప్పటి వరకు ఏం చేశారు?

నిన్న లోక్ సభలో ప్రధాని మోదీ తన గురించి మూడు, నాలుగు విషయాలు లేవనెత్తారని... ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా భాధను కలిగించాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే నుంచి తాము వైదొలగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ విషయాన్ని చెప్పడానికి అర్ధరాత్రి సమయంలో మోదీకి ఫోన్ చేశానని... ఆ సమయంలో ఆయన డిన్నర్ లో ఉన్నారని, తమ ఎంపీలు కూడా డిన్నర్ లో ఉన్నారని... దీంతో, పార్టీ నిర్ణయాన్ని ఎంపీలకు వివరించానని, మోదీకి ఆ విషయాన్ని చెప్పాలని సూచించానని తెలిపారు.

అయితే అప్పటికే అర్ధరాత్రి కావడంతో మోదీ తనతో మాట్లాడలేదని... తాను మాత్రం మోదీ సెక్రటరీకి ఫోన్ చేసి తమ నిర్ణయాన్ని తెలిపామని, టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తారని, ఆ విషయాన్ని మోదీకి కూడా చెప్పాలని కోరానని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.

మరుసటి రోజు ఉదయమే తనకు ప్రధానే ఫోన్ చేశారని... వైసీపీ ట్రాప్ లో మీరు పడుతున్నారని తనతో మోదీ అన్నారని చంద్రబాబు తెలిపారు. దీనికి సమాధానంగా... తాను కరెక్ట్ గా ఉన్నంత కాలం తనకు ఏమీ కాదని మోదీకి చెప్పానని అన్నారు. తనలాంటి కళంకం లేని వ్యక్తి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, కళంకిత వైసీపీతో ఎలా పోలుస్తారని మోదీని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నానని చెప్పారు. అక్రమాస్తుల కేసులో ప్రతివారం కోర్టుకు వెళ్లే వ్యక్తికి చెందిన పార్టీతో టీడీపీని పోలుస్తారా? అని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు మోదీ మాట్లాడుతూ, అన్ని అక్రమాస్తుల కేసుల విచారణలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని, అక్రమార్కులను కటకటాల వెనక్కి పంపుతామని చెప్పారని... స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని ఇండియాకు తెప్పిస్తామని, ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి ఆ డబ్బును జమ చేస్తామని అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.

అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డితో కర్ణాటక ఎన్నికల సమయంలో చేతులు కలిపారని విమర్శించారు. ఇలాంటి కళంకితులతో తనను ఎలా పోల్చుతారంటూ మండిపడ్డారు. కళంకిత రాజకీయ నేతలతో మోదీ ఎలా కలసి పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను చాలా క్లీన్ అని చెప్పుకుంటున్న మోదీ... మరోపక్క ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. 

More Telugu News