Gurugram: డబ్బుల విషయంలో సహచరుడితో గొడవ.. రెండో అంతస్తు నుంచి కిందపడి జిమ్ ట్రైనర్ దుర్మరణం!

  • ఇన్సెంటివ్‌ల విషయంలో వాగ్వాదం
  • ఒకరిపై ఒకరు దాడి
  • పట్టుతప్పి కిందపడిన వైనం

ఇద్దరు జిమ్ ట్రైనర్ల మధ్య మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తలపడతున్న సమయంలో పట్టుతప్పి రెండో అంతస్తు నుంచి కిందపడ్డారు. ఈ ఘటనలో ఓ ట్రైనర్ మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురుగ్రామ్‌లో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని మెహ్‌రౌలీకి చెందిన అనిల్ తన్వర్ (29), అతడి సహచరుడు గురుగ్రామ్ వాసి అయిన ప్రవీణ్ కుమార్‌లు గురుగ్రామ్‌లోని ఈరోస్ సిటీ స్క్వేర్ మాల్‌లో ఉన్న ప్లే ఫిట్‌నెస్ జిమ్‌లో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి ఇంటికెళ్లేందుకు ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే, ఆ వాగ్వాదం ఎందుకున్న విషయం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

జిమ్‌కు వచ్చే క్లయింట్లు ఇచ్చే ఇన్సెంటివ్‌ల విషయంలో అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వాగ్వాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో పట్టుతప్పి రెండో అంతస్తు నుంచి కిందపడ్డారు. గమనించిన సెక్యూరిటీ గార్డులు ఇద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే, తన్వర్ తలకు బలమైన గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News