Whatsapp: వాట్సాప్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించిన ప్రభుత్వం.. రెండోసారి నోటీసుల జారీ

  • వాట్సాప్‌లో విస్తృత ప్రచారం పొందుతున్న ఫేక్ న్యూస్
  • చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే నోటీసు
  • అయినా పట్టించుకోని వాట్సాప్

వాట్సాప్‌లో ఇటీవల వరుసపెట్టి షేర్ అవుతున్న తప్పుడు వార్తలు (ఫేక్ న్యూస్) అమాయకుల మరణానికి కారణమవుతున్నాయి. చిన్నపిల్లల కిడ్నాపర్లు అని, దోపిడీ దొంగలని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ అవుతున్న ప్రచారాన్ని నమ్మి అనుమానితులపై దాడులు చేసి చంపేస్తున్నారు. దేశ్యాప్తంగా ఇటీవల ఇటువంటి ఘటనలు లెక్కలేనన్ని జరిగాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం ఫేక్ న్యూస్‌పై విస్తరించకుండా అడ్డుకట్టవేయాలని, అటువంటి వార్తలు గ్రూపుల్లో షేర్ కాకుండా చూడాలని వాట్సాప్‌ను ఆదేశించింది.

అయినప్పటికీ ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట పడకపోవడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోమారు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో ఇది రెండో నోటీసు కావడం గమనార్హం. ఈసారి తీవ్ర హెచ్చరికలు చేసింది. వార్తలపై ఎటువంటి నియంత్రణ ఉండడం లేదని, ముందస్తు తనిఖీలు ఉండడం లేదని పేర్కొన్న ప్రభుత్వం మరోసారి ఇలా జరిగితే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. నేరస్తులకు సాయం అందిస్తున్నట్టుగా వాట్సాప్‌ను పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.

More Telugu News