love: ప్రేమ పేరుతో బాలికకు గాలం.. ఇంట్లో నిర్బంధించి ఏడుగురు అత్యాచారం!

  • ప్రేమ పేరుతో అత్యాచారం
  • వీడియో తీసి బ్లాక్ మెయిల్
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు

అత్యాచార కేసుల్లో దోషులుగా తేలిన వారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలు మారుస్తున్నప్పటికీ ఫలితం మాత్రం ఉండడం లేదు. చెన్నైలో ఓ బధిర బాలికపై ఏడు నెలలపాటు సామూహిక అత్యాచారం ఘటనను మర్చిపోకముందే, పక్కనే ఉన్న పుదుచ్చేరిలో మరో ఘోరం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో 17 ఏళ్ల బాలికను వంచించిన యువకుడు మరికొందరితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం..

పుదుచ్చేరి రెడ్డియార్‌పాళయానికి చెందిన బాధిత బాలిక ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. రోజూ బస్సులో కనిపించే బాలికతో వలుదావూర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్టు నమ్మబలికాడు. ఇటీవల ఆమెను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన నిందితుడు అది చూపించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

తాజాగా మరోమారు ఆమెను ఓ ఇంటికి పిలిపించి బంధించాడు. అనంతరం తన స్నేహితులు ఆరుగురిని ఇంటికి పిలిపించాడు. అందరూ కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి బయటపడిన బాలిక విషయాన్ని బంధువులకు చెప్పడంతో వారు బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు. బాలికను విచారించిన కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News