Base Year: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింతగా పెరగనున్న వేతనం!

  • కరవు భత్యం బేస్ ఇయర్ మార్పు
  • 2001 నుంచి 2016కు మార్చనున్న కేంద్రం
  • 1.10 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ది

ఇప్పటికే 2 శాతం పెరిగిన కరవు భత్యం (డీఏ) తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి వేతనం పెరగనుంది. డీఏను గణించే ఇండెక్స్, బేస్ ఇయర్ ను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించగా, దాదాపు 1.10 కోట్ల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్దిని పొందనున్నారు. ఉద్యోగులకు ఎంత డియర్నెస్ అలవెన్స్ ఇవ్వాలన్న విషయమై, పారిశ్రామిక రంగ కార్మికుల కోసం కొత్త సిరీస్ వినియోగదారుల ధరల సూచీని విడుదల చేసేందుకు కార్మిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు జీవన సర్దుబాటు భత్యం ఖర్చు కింద ఈ డీఏను చెల్లిస్తారు. 2016 బేస్ ఇయర్ గా కొత్త సూచికను ఇప్పటికే లేబర్ బ్యూరో ఖరారు చేసిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతమున్న 2001 సీపీఐ-ఐడబ్ల్యూ బేస్ ఇయర్ ను ఏకంగా 15 సంవత్సరాలు ముందుకు తేవడంతో ఉద్యోగులు భారీగా లబ్దిని పొందనున్నారని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవల 7వ వేతన సంఘ సిఫార్సుల మేరకు కరవు భత్యాన్ని 7 శాతానికి పెంచగా, అది ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 48.41 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసిన 61.17 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలిగిన సంగతి తెలిసిందే.

More Telugu News