Chandrababu: నరేంద్ర మోదీని వదలద్దు... సభలోనే నిలదీయండి!: ఎంపీలతో చంద్రబాబు

  • ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని మోదీ అన్నారు
  • ఎందుకు చక్కదిద్దడం లేదని నిలదీయండి
  • ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు

పార్లమెంట్ తలుపులను మూసేసి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారని గతంలో ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోదీ, జరిగిన అన్యాయాన్ని ఎందుకు సరిదిద్దడం లేదని నిలదీయాలని తెలుగుదేశం ఎంపీలకు చంద్రబాబు సూచించారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఉదయం టెలీ కాన్ఫరెన్స్ లో ఎంపీలతో మాట్లాడిన చంద్రబాబు, వారికి దిశానిర్దేశం చేశారు.

అవిశ్వాస తీర్మానంపై వివిధ పార్టీల ప్రతినిధులను కలసి మద్దతు కోరిన ఎంపీలను ప్రత్యేకంగా అభినందించిన చంద్రబాబు, సభలో ప్రధానిని నిలదీయాలని అన్నారు. అన్యాయం జరిగిందన్న ఆయనే ఎందుకు చక్కదిద్దలేదో అడగాలని, తాను ఎప్పటికప్పుడు ఢిల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటానని చంద్రబాబు తెలిపారు.

ఒక లక్ష్యం కోసం మనం పోరాటం చేస్తున్నామని ఎంపీలతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళదామని అన్నారు. సభలో సస్పెండ్ చేసినా వెనుకాడవద్దని, ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టుదలతో పోరాడాలని, ఇతర పార్టీల మద్దతును కూడగట్టాలని ఈ సందర్భంగా ఎంపీలకు ఆయన సూచించారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ఇప్పుడు పార్లమెంట్ వైపు చూస్తున్నారని, ఈ పోరాటంలో తెలుగుదేశం ఎంపీల పాత్రే కీలకమని అన్నారు. 

More Telugu News