mp kavitha: నాన్ సీరియస్ పొలిటీషియన్స్ మాట్లాడితే నాకు మాట్లాడబుద్ధి కాదు: ఎంపీ కవిత

  • ప్రజల్లో క్రెడిబులిటీ ఉన్నవాళ్లు మాట్లాడితే స్పందిస్తా
  • కోమటిరెడ్డి గురించి పెద్దగా మాట్లాడేదేమీ లేదు
  • తెలంగాణాయే మా కులం 

టీఆర్ఎస్ ఎంపీ కవిత మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా కవిత స్పందిస్తూ, ‘నాన్ సీరియస్ పొలిటీషియన్స్ మాట్లాడితే నాకు మాట్లాడబుద్ధి కాదు. ఎందుకంటే, సీరియస్ నెస్ ఉన్న వాళ్లు, కొద్దిగా ప్రజల్లో క్రెడిబులిటీ ఉన్నవాళ్లు మాట్లాడితే నేను మాట్లాడతా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి పెద్దగా మాట్లాడేదేమీ లేదు’ అని అన్నారు. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు.

 టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ వ్యవహారంపైన, కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు తెలిపే అంశంపైన సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. టీఆర్ఎస్ ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీ అని, మిగిలిన సామాజిక వర్గాలకు అక్కడ ప్రాధాన్యం ఉండదని ఇటీవల కాంగ్రెస్ నేత కుంతియా చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ, ‘కుంతియా కరెక్టే చెప్పారు. మాది తెలంగాణ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ. తెలంగాణాయే మా కులం. ఆ కులానికి సంబంధించిన పార్టీయే టీఆర్ఎస్ పార్టీ. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చారు.

More Telugu News