neet: 'నీట్'గా మాయాజాలం.. సున్నా మార్కులు వచ్చినా డాక్టర్ అయిపోవచ్చు!

  • నీట్ ప్రవేశ పరీక్షలో లేని కటాఫ్ మార్కులు
  • మార్కులతో సంబంధం లేకుండా.. డబ్బుంటే డాక్టర్ అయిపోవచ్చు
  • సంచలన విషయాలను వెల్లడించిన రిపోర్ట్

వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష డొల్లతనం క్రమంగా బయటకు వస్తోంది. 2017లో నిర్వహించిన నీట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో కేవలం సింగిల్ డిజిట్ మార్కులు తెచ్చుకున్న దాదాపు 400 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటును సాధించారు. ఇంకా దారుణం ఏమిటంటే... సున్నా మార్కులు లేదా నెగెటివ్ మార్కులు తెచ్చుకున్న 110 మంది విద్యార్థులు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ పొందారు. ఈ నేపథ్యంలో, నీట్ పరీక్ష అర్హతపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.

ఒక రిపోర్ట్ ప్రకారం.. 2017లో ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 530 మంది సింగిల్ డిజిట్ లేదా సున్నా లేదా నెగెటివ్ స్కోరును సాధించారు. ఈ 530 మంది విద్యార్థుల్లో 507 మంది ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చేరారు. నీట్ ఎగ్జామ్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో కటాఫ్ మార్కులు లేకపోవడం గమనార్హం. ప్రతి పేపర్ లో కనీసం ఇన్ని మార్కులు సాధించాలనే షరతులు ఈ ప్రవేశ పరీక్షలో లేవు. ఈ నేపథ్యంలో, ఏడాదికి రూ. 17 లక్షల ఫీజు చెల్లించగల స్తోమత ఉన్నవారంతా... మార్కులతో సంబంధం లేకుండా ఎంబీబీఎస్ లో జాయిన్ అయిపోతున్నారు.

వాస్తవానికి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ప్రతి సబ్జెక్ట్ లో 50 శాతానికి మించి (రిజర్వ్ డ్ కేటగిరీలకు 40 శాతం) మార్కులు వస్తేనే మెడిసిన్ లేదా డెంటల్ కాలేజీలలో ప్రవేశానికి అర్హత ఉంటుంది. 2012లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త ఉత్తర్వులను జారీ చేస్తూ, నీట్ ఎగ్జామ్ లో అర్హత మార్కును 50 శాతం, 40 శాతం నుంచి 50వ, 40వ శతాంశాలుగా (పర్సెంటైల్) మార్చుతున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సున్నా మార్కులు వచ్చిన శ్రీమంతులు డాక్టర్ పట్టా పుచ్చుకునే అవకాశం ఏర్పడింది. దీనిపై, సర్వత్ర ఆశ్చర్యంతో పాటు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

More Telugu News