Warangal Rural District: వరంగల్‌లో కలకలం రేపుతున్న డెత్ యానివర్సరీ సెలబ్రేషన్స్!

  • ఏడాది క్రితం కార్పొరేటర్ హత్య
  • చావు సంబరాలను జరుపుకున్న నిందితులు
  • కేరింతలు కొడుతూ వికృతానందం

ఏడాది క్రితం ప్రత్యర్థిని హత్య చేసిన నిందితులు తాజాగా చావు సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇందుకు సబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంతోషంగా కేకును కట్‌చేసిన నిందితులు ప్రత్యర్థిని పొడుస్తున్నట్టు, పేగులు బయటకు తీస్తున్నట్టు వికృతానందం పొందారు.

గతేడాది జూలై 13న హన్మకొండ కుమార్‌పల్లిలో కార్పొరేటర్ అనిశెట్టి మురళీ మనోహర్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో బొమ్మతి విక్రం, చిరంజీవి, వరుణ్‌ పోలీసులకు లొంగిపోయారు. ఆ తర్వాత మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆ తర్వాత వీరంతా బెయిలుపై బయటకొచ్చారు. ఈ నెల 14న నిందితుడు బొమ్మతి విక్రం ఇంట్లో మురళీ డెత్‌డే పార్టీని ఘనంగా నిర్వహించారు. ఫుల్లుగా మందుకొట్టి కేకును కత్తులతో పొడుస్తూ కేరింతలు కొట్టారు. కేక్‌ను మధ్యకి చీలుస్తూ 'ఇవి మురళీ పేగులు' అంటూ వికృతానందం పొందారు. ఇప్పుడీ వీడియో వరంగల్‌లో సంచలనం సృష్టిస్తోంది.

More Telugu News