anantapuram: ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికే ‘గ్రామ దర్శిని’: మంత్రి కాలవ శ్రీనివాసులు

  • రాయ‌దుర్గంలోని ‘వార్డు దర్శిని’ ప్రారంభించిన కాలవ
  • పేద‌ల సంక్షేమమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం 
  • పేద‌రికం లేని స‌మాజమే చంద్ర‌బాబు ఆశ‌యం

ఏపీలో ప్రజా సమస్యలు, అవసరాలు తీర్చడానికే గ్రామ దర్శిని, వార్డు దర్శిని కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయ‌దుర్గం పట్టణంలోని 13వ వార్డులో ‘వార్డు దర్శిని’ కార్య‌క్ర‌మాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేద‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందని, పేద‌రికం లేని స‌మాజమే సీఎం చంద్ర‌బాబునాయుడు ఆశ‌యం అని అన్నారు. దీనిలో భాగంగా గ్రామ దర్శిని, వార్డు దర్శిని కార్యక్రమాలతో ప్రజా అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి ప్రజల చెంతకు ప్రభుత్వం వచ్చిందని, పట్టణాల్లో ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాన్ని, ఇళ్ల నిర్మాణాలకు నిధులు అందజేస్తున్నట్టు చెప్పారు.పెన్షన్ల మొత్తాన్ని ఐదు రెట్లు పెంచామని, మ‌హిళా స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు పెట్టుబ‌డి ప్రోత్సాహకాన్ని అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని  అన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని, పేద‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ఆశీర్వదించి అండ‌గా నిల‌వాలని కోరారు. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో రూ.3000 కోట్ల‌ విలువైన అభివృద్ధి పనులను రాయ‌దుర్గంలో చేప‌ట్టినట్టు చెప్పారు. అనంతరం, ఆ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. వ్యక్తిగత, సామూహిక సమస్యలను పరిష్కారిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వార్డులోని పెన్షనర్లతో కలిసి సామూహిక అల్పాహార విందులో కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంలో రూ.30 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్, రూ.7 లక్షలతో నిర్మించనున్న అంగన్ వాడీ కేంద్రాలకు భూమి పూజ చేశారు. అదే ప్రాంతంలో రూ.24.60 లక్షలతో నిర్మించిన వ్యవసాయ గోదామును ప్రారంభించారు. 

More Telugu News