Jana Reddy: వాళ్లిద్దరినీ మేము ఓడించకపోతే చెప్పులు మెడలో వేసుకుని తిరుగుతా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు

  • ఉత్తమ్, జానాను ఓడించే బాధ్యత పార్టీ నాకప్పగించాలి
  • వారికి డిపాజిట్ రాకుండా చేస్తా 
  • నల్గొండ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందా?

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చేఎన్నికల్లో జగదీష్ రెడ్డి యాభై వేల మెజార్టీతో గెలవకపోతే, నల్గొండ జిల్లాకు చెందిన తమ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేస్తామని మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డిలను ఓడించే బాధ్యతను పార్టీ తనకు అప్పగిస్తే వారికి డిపాజిట్ రాకుండా చేస్తానని, ఇచ్చిన మాట నెరవేర్చుకోకపోతే మెడలో చెప్పుల దండ వేసుకుని తిరుగుతానని సవాల్ విసిరారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎత్తు గురించి కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

‘రాజకీయాల్లో ఉండేందుకు ఏమైనా ఫీట్ల లెక్కుందా? ఈ మాటలు జ్ఞానం ఉన్న మనుషులు మాట్లాడేవేనా? జగదీష్ రెడ్డి గారికి డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు! చాలెంజ్ చేసి చెబుతున్నా..50 వేల మెజార్టీ కన్నా తక్కువొస్తే నల్గొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరం రాజీనామాలు చేస్తాం. నల్గొండ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందా? జానా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను మేము ఓడించకపోతే చెప్పులు మెడలో వేసుకుని బజారులో తిరుగుతాను’ అని ఉద్వేగంగా అన్నారు.

More Telugu News