Hyderabad: హైదరాబాద్‌లో దారుణం: పిలిస్తే పలకలేదని యువకుడిని పొడిచి చంపేశారు

  • స్పందించనందుకు స్నేహితుల మధ్య వాగ్వాదం
  • కత్తితో పొడిచిన మరో యువకుడు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

పిలిస్తే పలకలేదన్న అతి చిన్న కారణంతో స్నేహితుడినే పొట్టనపెట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మంగళహాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణం అందరినీ నివ్వెర పరుస్తోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిర్రా కిషన్‌నగర్‌కు చెందిన జాఫర్ కుమారుడు మహమ్మద్ ఇసా (22) పండ్ల వ్యాపారి. శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇసాను అతడి స్నేహితుడు మాజిద్ పని ఉందని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో బైక్‌పై వెళ్తున్న ఇసాను చూసిన అతడి స్నేహితులు మహమూద్, ముస్తాపాలు పిలిచారు. వారి పిలుపు వినిపించకపోవడంతో ఇసా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. రాత్రి 11:30 గంటలకు ఇసా తిరిగి వస్తున్నప్పుడు అక్కడే కాపుకాసిన స్నేహితులు మరోమారు పిలిచారు. దీంతో వారి వద్దకు వెళ్లిన ఇసాతో గొడవకు దిగారు. పిలిచినా పట్టించుకోకుండా ఎందుకు వెళ్లిపోయావని నిలదీశారు.

 ఈ క్రమంలో ఇసా, మహమూద్‌ల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన మహమూద్ కత్తితో ఇసాపై దాడిచేశాడు. చాతిపై కత్తిపోట్లు తగలడంతో ఇసా కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇసాను ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

More Telugu News