Almatti: ఆల్మట్టికి లక్ష క్యూసెక్కుల వరద... శరవేగంగా నిండుతున్న జలాశయం!

  • తూర్పు కర్ణాటకలో భారీ వర్షాలు
  • 1,00,667 క్యూసెక్కులకు చేరిన వరద
  • మరో 36 టీఎంసీలు వస్తే, నీరు దిగువకు

తూర్పు కర్ణాటక పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి జలాశయానికి ఈ సీజన్ లో తొలిసారిగా భారీ వరద నమోదైంది. జలాశయానికి వస్తున్న వరద తొలిసారిగా లక్ష క్యూసెక్కులను దాటడంతో, నీటిమట్టం శరవేగంగా పెరుగుతోంది.

ఈ ఉదయం ఆల్మట్టి ఇన్ ఫ్లో 1,00,667 క్యూసెక్కులుగా నమోదు కాగా, 129.72 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో 93 టీఎంసీలకు నిల్వ పెరిగింది. బయటకు ఒక్క చుక్కను కూడా వదలడం లేదు. వర్షాలింకా కురుస్తూ ఉండటంతో, మరో రెండు రోజుల్లోనే నీటిని దిగువకు విడిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకో 36 టీఎంసీల నీరు చేరితే, దిగువకు నీటిని వదులుతామని అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో తుంగభద్ర జలాశయం సైతం వేగంగా నిండుతోంది. రిజర్వాయర్ కు 69,762 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 100 టీఎంసీల సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 72 టీఎంసీలకు నీరు చేరింది. కృష్ణా నదిపై ఉన్న మిగతా ప్రాజెక్టులకు వస్తున్న ఇన్ ఫ్లో నామమాత్రమే.

More Telugu News