governor: చెప్పాపెట్టకుండా వచ్చి... ‘మెట్రో’లో ప్రయాణించిన గవర్నర్ నరసింహన్ దంపతులు!

  • అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా ప్రయాణం
  • బేగంపేట్ లో రైలెక్కి అమీర్ పేట్ లో దిగిన వైనం
  • కనెక్టింగ్ ట్రైన్ లో మియాపూర్ వెళ్లిన దంపతులు

హైదరాబాద్ మెట్రో రైలులో గవర్నర్ నరసింహన్ దంపతులు సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించారు. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా బేగంపేట్ మెట్రో స్టేషన్ కు వచ్చిన నరసింహన్ దంపతులు మెట్రో రైలు ఎక్కి అమీర్ పేట్ జంక్షన్ లో దిగి, అక్కడి నుంచి మియాపూర్ కు కనెక్టింగ్ ట్రైన్ లో బయలు దేరి వెళ్లారు.

అయితే, కూకట్ పల్లిలో అప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఈ సమాచారం చేరడంతో ఆయన మియాపూర్ వెళ్లి నరసింహన్ దంపతులకు స్వాగతం పలికారు. కానీ, ఆ స్వాగతాన్ని సున్నితంగా ఆయన తిరస్కరించారు. మియాపూర్ జంక్షన్ లోని సౌకర్యాలను చూపుతానని ఎన్వీఎస్ రెడ్డి కోరగా, సాధారణ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూపించాలని నరసింహన్ చెప్పారు.

‘మెట్రో’ సదుపాయాలపై గవర్నర్ దంపతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డిని, ‘మెట్రో’ సిబ్బందిని వారు అభినందించారు. మాస్కోలోని మెట్రో తరహాలో ఆర్ట్ మ్యూజియంలను కూడా మెట్రో సేషన్ల వద్ద ఏర్పాటు చేయాలని నరసింహన్ సూచించడం గమనార్హం.

More Telugu News