Bhopal: బందీగా ఉన్న మోడల్ ను విడిపించి, యువకుడిని నడిరోడ్డుపై నడిపిస్తూ, చెప్పులతో కొట్టించిన పోలీసులు.. వీడియో వైరల్!

  • భోపాల్ లో మోడల్ ను గదిలో నిర్బంధించిన వ్యక్తి
  • అరెస్ట్ చేసి నడిపిస్తూ తీసుకెళ్లిన పోలీసులు
  • చెప్పులతో కొడుతున్న వీడియో వైరల్

భోపాల్ లో ఓ అమ్మాయిని 12 గంటల పాటు గదిలో నిర్బంధించి, తనను వివాహం చేసుకోవాలని వేధించిన కామాంధుడి నుంచి ఆమెను విడిపించిన పోలీసులు, అతనికి నడిరోడ్డుపై బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. భోపాల్ లోని మిస్ రోడ్ ఏరియాలో ఉన్న ఐదంతస్తుల భవంతిలో రోహిత్ సింగ్ (30) అనే యువకుడు మోడల్ గా పనిచేస్తున్న 26 ఏళ్ల వయసున్న యువతిని నిర్బంధించిన సంగతి తెలిసిందే.

ఆమెను దారుణంగా హింసించి, పోలీసులతో వీడియో కాల్ లో మాట్లాడుతూ, తన డిమాండ్లు చెప్పాడు. అతనితో జాగ్రత్తగా డీల్ చేసిన పోలీసులు, ఆమెను బంధ విముక్తురాలిని చేశారు. ఇక భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్ ను నడిపించి తీసుకు వెళుతూ మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరు పరిచామని, ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని మిస్ రోడ్ పోలీస్ ఇనస్పెక్టర్ సంజీవ్ చౌసీ వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం తదితర కేసులు పెట్టినట్టు చెప్పారు.

కాగా, అసిస్టెంట్ కాస్టింగ్ డైరెక్టర్ గా ఉన్న రంజిత్ కు, బాధితురాలికి మధ్య చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. వారికి ముంబైలో పరిచయం కాగా, తొలి రోజుల్లో అతను తనను ఇబ్బంది పెట్టలేదని, ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులు ప్రారంభించాడని, స్టాంప్ పేపర్ పై ఆ విషయాన్ని రాసివ్వాలని బలవంతం చేశాడని ఆరోపించింది. తనకు అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, అతన్ని జైలుకు పంపకుంటే తన ప్రాణాలకు ముప్పేనని వ్యాఖ్యానించింది. రోహిత్, మెడపై కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

More Telugu News