Kumaraswamy: కంట తడి పెట్టుకున్న కుమారస్వామి.. విషం మింగుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు

  • కార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకున్న సీఎం
  • తాను మింగుతున్నది విషం కంటే ఎక్కువని వ్యాఖ్య
  • సీఎంగా తాను సంతోషంగా లేనన్న కుమార

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అన్నో, తమ్ముడో ముఖ్యమంత్రి అయినట్టు తన పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయని అన్నారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయినందుకు జేడీఎస్ నేతలు ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

దీనికి హాజరైన కుమారస్వామి బొకేలు తీసుకోవడానికి, పూలదండలు వేయించుకోవడానికి నిరాకరించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘మీ అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు. కానీ నేను సంతోషంగా లేను. నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషం కంటే ఏమీ తక్కువ కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా నేను ఉండలేను. ప్రస్తుత పరిస్థితుల్లో నేను అంత సంతోషంగా లేను’’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఎన్నికల ప్రచారం సందర్భంగా తానెక్కడికి వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని, అదేమి అదృష్టమో కానీ తన పార్టీ సభ్యులకు మాత్రం ఓట్లు వేయడాన్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దేవుడైతే నాకీ అధికారం (సీఎం పదవి) ఇచ్చాడు. నేను ఎన్ని రోజులు పదవిలో ఉండాలనేది ఆయనే నిర్ణయిస్తాడు’’ అని కుమారస్వామి పేర్కొన్నారు.

మరోవైపు, కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడి ఆరోగ్యం గురించి కలత చెందుతున్నారు. విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 18 గంటలు పనిచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కుమారస్వామి ఆరోగ్యం అంతంత మాత్రమే కావడంతో ఈ ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని విచారిస్తున్నారు.

More Telugu News