Pathholes: రోడ్డుపై గుంతలు 3,597 మందిని పొట్టనపెట్టుకున్నాయి!

  • ఉగ్రవాదుల కంటే భయంకరంగా మారుతున్నపాత్‌హోల్స్
  • రోజుకు సగటున పదిమంది ప్రాణాలు గాల్లోకి
  • అగ్రస్థానంలో యూపీ

పాత్‌హోల్స్(రోడ్డుపై గుంతలు) దేశంలో ఉగ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఉగ్రవాదుల కంటే వీటి వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2017 దేశవ్యాప్తంగా 803 మంది ఉగ్రదాడుల వల్ల ప్రాణాలు కోల్పోతే, పాత్‌హోల్స్ వల్ల ఏకంగా 3,597 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  అంటే రోజుకు సగటున పదిమంది ప్రాణాలు గుంతల్లో కలిసిపోతున్నాయి.

2016తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండింతలు అయింది. 2017లో నక్సల్స్, ఉగ్రవాదుల దాడుల వల్ల టెర్రరిస్టులు, భద్రతా సిబ్బంది, పౌరులు కలిసి మొత్తం 803 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో గుంతల్లో పడి 3,597 మంది మృతి చెందడం విషాదకరం.

రోడ్డు గుంతల్లో పడి మరణిస్తున్న వారి సంఖ్యలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2017లో యూపీలో ఏకంగా 987 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 726 మంది, హరియాణాలో 522 మంది, గుజరాత్‌లో 228 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతకుముందు ఏడాది ఆయా రాష్ట్రాల్లో సంభవించిన మరణాల కంటే ఇవి ఎక్కవ కావడం గమనార్హం. ఇక 2016లో ఆంధ్రప్రదేశ్‌లో 131 మంది గుంతల్లో పడి చనిపోయారు.

More Telugu News