New Delhi: న్యూఢిల్లీ మ్యూజియం నుంచి వస్తువును దొంగిలించిన మిలియనీర్... సీసీటీవీ దృశ్యాలు!

  • పురాతన కాలానికి చెందిన రాతి గొడ్డలి దొంగతనం
  • ఉదయ్ రాత్ర అనే మిలియనీర్ అరెస్ట్
  • ట్విట్టర్ లో వివరాలు తెలిపిన ఐపీఎస్ ఆఫీసర్ మధుర్ వర్మ

న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఓ విలువైన వస్తువు దొంగతనానికి గురికాగా, సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు, అధికారులు, గురుగ్రామ్ లోని ఓ మిలియనీర్ ఈ పని చేశాడని గుర్తించారు. పురాతన కాలానికి చెందిన రాతి చేతి గొడ్డలి జూన్ 24న కనిపించకుండా పోయింది. మ్యూజియం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన అధికారులు ఓ వ్యక్తి దాన్ని దొంగిలించినట్టు గుర్తించారు.

సదరు వ్యక్తి గురుగ్రాంకు చెందిన 53 ఏళ్ల మిలియనీర్ ఉదయ్ రాత్ర అని గుర్తించిన పోలీసులు, శుక్రవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. అతని నుంచి ఆ రాయిని స్వాధీనం చేసుకున్నామని, పెద్దగా ప్రతిఘటన లేకుండానే ఆయన లొంగిపోయాడని ఐపీఎస్ అధికారి మధుర్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడిస్తూ, సీసీటీవీ ఫుటేజ్ ని జతచేశారు. ఈ రాతి గొడ్డలి 15 లక్షల సంవత్సరాల క్రితం ఆత్మరక్షణకు వాడినదని ఆయన తెలిపారు. కాగా, ఉదయ్ రాత్ర గతంలోనూ నేర చరిత్రను కలిగివున్నాడని, 20 ఏళ్ల పాటు యూకేలో ఉన్న ఆయన్ను 2006లో డిపోర్ట్ చేశారని, ఆపై 2016లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో యూఎస్ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ బస చేసిన వేళ, బ్లేడుతో లోపలికి ప్రవేశించబోయి అరెస్టయ్యారని పోలీసు అధికారులు వెల్లడించారు.

More Telugu News