Hyderabad: హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాను ఆకస్మిక తనిఖీ చేసిన కేటీఆర్‌

  • బేగంపేట శ్యామ్ లాల్ బిల్డింగ్‌లో బస్తీ దవాఖానా
  • ఉచిత సేవలు అందిస్తోన్న జీహెచ్ఎంసీ 
  • ఆసుపత్రి సిబ్బంది పనితీరు ఎలా ఉందని ప్రశ్నించిన కేటీఆర్‌
  • దవాఖానా పని చేస్తోన్న తీరు సంతృప్తిగా ఉందన్న రోగులు

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న శ్యామ్ లాల్ బిల్డింగ్‌లో జీహెచ్ఎంసీ నిర్వహిస్తోన్న బస్తీ దవాఖానా పనితీరును పరిశీలించేందుకు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆ దవాఖానాలో ఉన్న వసతులు, అక్కడి సిబ్బంది పనితీరును మంత్రి పరిశీలించారు. వైద్యురాలితో పాటు ఆమె సహాయక సిబ్బందితో మాట్లాడి రోజు వారీగా ఎంత మంది ఆసుపత్రి సేవలను వినియోగించుకుంటున్నారో కనుక్కున్నారు.

ఎవరికైనా సీరియస్ గా ఉంటే ఎక్కడికి పంపిస్తారో తెలుసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దగ్గరలోని ప్రాథమిక అరోగ్య కేంద్రాలకు లేక దగ్గరలోని ప్రభుత్వ అసుపత్రులకు తరలిస్తామని వైద్యురాలు తెలిపారు. ప్రస్తుతమున్న సౌకర్యాలతో పాటు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాల్సి ఉంటే సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ధవాఖానా వైద్య సేవల కోసం వచ్చిన రోగులతో మంత్రి మాట్లాడారు.

బస్తీ దవాఖానా అందిస్తోన్న సేవల పట్ల వారి స్పందనను అడిగి తెలుసుకున్నారు. దవాఖానాలో మందులు ఇస్తున్నారా? లేదా? అని అడిగారు. నగరంలో మొత్తం 1,000 ఉచిత దవాఖానాలు ఉండాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోందని, అన్ని బస్తీల్లోనూ దవాఖానాలు ఉండేలా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. వివిధ రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేసే డయాగ్నస్టిక్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.  బస్తీ దవాఖానాలోనూ శాంపిల్స్‌ తీసుకొని ఆయా డయాగ్నస్టిక్ సెంటర్ లలో పరీక్షించి నేరుగా రోగుల మొబైల్ ఫోన్‌కు లేక ఈ మెయిల్ కి పంపించే సదుపాయం కూడా ఉంటుందని తెలిపారు. పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో బస్తీ దవాఖానా, డయాగ్నస్టిక్ సెంటర్ల లాంటి అనేక వినూత్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. బస్తీ దవాఖానా పని చేస్తోన్న తీరు చాలా సంతృప్తిగా ఉందని, ప్రభుత్వం ఇలాంటి సౌకర్యాన్ని కల్పించడం పట్ల అక్కడి రోగులు హర్షం వ్యక్తం చేశారు.  

More Telugu News