Kadiam Srihari: గ్రామ సర్పంచ్ లనే పర్సన్ ఇన్ ఛార్జీలుగా కొనసాగిస్తాం: కడియం శ్రీహరి

  • సర్పంచ్‌ల పదవీకాలం ఈ నెల 31తో ముగింపు
  • స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు.. పర్సన్ ఇంఛార్జీల పాలన
  • తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘానికి కడియం హామీ

తెలంగాణలో సర్పంచ్ ల పదవీకాలం ఈ నెల 31వ తేదీన ముగుస్తున్నందున అనంతరం స్పెషల్ ఆఫీసర్స్ పాలన బదులు.. సర్పంచ్ లను పర్సన్ ఇంఛార్జీగా కొనసాగించాలన్న విజ్ణప్తిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదాని భూమన్న యాదవ్ తో పాటు మరికొంత మంది ఈ రోజు కడియం శ్రీహరిని ఆయన నివాసంలో కలిసి సర్పంచ్ ల సమస్యలను వివరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో 8,684 మంది సర్పంచ్ లు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించారని పేర్కొన్నారు.

స్పెషల్ ఆఫీసర్స్ పాలన మొదలైతే గ్రామ స్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు వస్తాయని కడియం శ్రీహరి తెలిపారు. గత ఐదేళ్లుగా సర్పంచ్ లుగా కొనసాగుతోన్న వారినే పర్సన్ ఇన్ ఛార్జీ సర్పంచ్ లుగా కొనసాగిస్తే ప్రభుత్వానికి మద్దతుగా మరికొంతకాలం సహకరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తరువాత కూడా వారిని కొనసాగించినట్లే తమనూ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కడియం శ్రీహరి సానుకూలంగా స్పందించారు. 

More Telugu News