Madhya Pradesh: భోపాల్‌లో యువతిని గదిలో నిర్బంధించి కలకలం రేపుతోన్న యువకుడు.. పోలీసుల హైరానా!

  • ఆ అమ్మాయితో పెళ్లి చేయాలని డిమాండ్‌
  • ఇటీవల ఆమెకు ఫోన్‌ కాల్స్‌ చేసిన రోహిత్‌  
  • యువతి తల్లిదండ్రులను ఇంట్లోని మరో గదిలో బంధించిన వైనం

మధ్య ప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఓ అమ్మాయిని గదిలో నిర్బంధించిన యువకుడు కలకలం రేపుతున్నాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. తాను ఆ యువతిని ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని కిటికీలోంచి యువకుడు చెబుతున్నాడు.

ఆ యువతి కొన్ని నెలలు ముంబయిలో ఉండి రెండు నెలల క్రితం భోపాల్‌కు వచ్చిందని, అప్పటి నుంచి రోహిత్‌ అనే యువకుడు ఆమెకు ఫోన్‌ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఇటీవల ఆమెకు రోహిత్‌ పలుసార్లు ఫోన్‌ చేయగా ఆ యువతి స్పందించలేదు. దీంతో ఆ యువకుడు ఈరోజు ఉదయం ఆమె ఇంట్లోకి చొరబడి లోపలి నుంచి గడియ వేసి, ఆమెను అందులో నిర్బంధించాడు. ఆ సమయంలో యువతి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. వారిని కూడా ఆ యువకుడు మరో గదిలో బంధించినట్లు తెలిసింది. ఓ అపార్ట్‌మెంటులోని ఐదో అంతస్తులో ఆ యువతి ఫ్లాట్‌ ఉంది.

తన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో ఆ యువకుడు పోలీసులతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడాడు. ఆ గదిలో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది. మరోవైపు రక్తపు మరకలు కూడా కనపడుతున్నాయి. తన స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్‌ అయిపోతోందని, తనకు త్వరగా ఛార్జర్‌ కూడా ఇవ్వండని ఆ యువకుడు కోరాడు పోలీసులను. 

More Telugu News