Chandrababu: మోదీ తర్వాత ఆ రికార్డు చంద్రబాబుదే.. కానీ ఏం లాభం?: వైసీపీ నేత బుగ్గన

  • మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబే
  • సింగపూర్ కు ఎవరూ పిలవకున్నా.. టికెట్ కొనుక్కుని వెళ్లారు
  • అర్థం కాకుండా మాట్లాడటంలో చంద్రబాబును మించినవారు లేరు

గత నాలుగేళ్లలో ఆరుసార్లు సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు. సింగపూర్ లో జరిగిన ప్రపంచ నగరాల సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలవలేదని... టికెట్ కొనుక్కుని ఆయనే వెళ్లారని ఆరోపించారు. మన దేశంలో ప్రధాని మోదీ తర్వాత ఎక్కువ విదేశీ పర్యటనలు చేసింది చంద్రబాబేనని... దీని వల్ల ప్రజాధనం దుర్వినియోగం తప్పితే, చేకూరిన ప్రయోజనం ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

సింగపూర్ కంపెనీలకు రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని బుగ్గన విమర్శించారు. వ్యవసాయ రుణాలు మాఫీ చేసినట్టు సమావేశాల్లో రైతులతో బలవంతంగా చెప్పిస్తూ, మీడియాలో దాన్ని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఎవరికీ అర్థంకాని రీతిలో మాట్లాడటంలో చంద్రబాబును మించినవారు లేరని చెప్పారు. తనకు ధైర్యం చెప్పేందుకు ఎక్కడకు వెళ్లినా యనమలను వెంటపెట్టుకుని వెళ్తారని అన్నారు. సులభతర వాణిజ్యంలో ఏపీ నెంబర్-1గా నిలిచిందని ఊదరగొడుతున్నారని... కానీ ఏపీకి ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 

More Telugu News