PV Narasimharao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు

  • 23 ఏళ్ల పాటు సాగిన కేసు విచారణ
  • పీవీ మూడో కుమారుడిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
  • స్వతంత్ర భారతావనిలో ఇంత భారీ జరిమానా ఇదే తొలిసారి

సంచలనం రేపిన యూరియా కుంభకోణంలో సీబీఐ న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు సమీప బంధువు సంజీవరావుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. కోటి జరిమానాను విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. మాజీ మంత్రి రామ్ లఖన్ యాదవ్ తనయుడు  ప్రకాశ్‌ చంద్ర యాదవ్‌, జాతీయ ఎరువుల సంస్థ మాజీ అధికారులు సీకే రామకృష్ణన్‌, దిల్‌ బాగ్‌ సింగ్‌ కన్వర్‌ లను దోషులుగా తేల్చి వారికి కూడా ఇదే శిక్షను ఖరారు చేసింది.

ఇదే కేసులో ప్రమేయముందని రుజువైన ఇద్దరు టర్కీ జాతీయులు టంకే అలంకస్, సిహాన్ కర్సానీలకు రూ. 100 కోట్ల జరిమానా, చెరో ఆరేళ్ల చొప్పున కారాగార శిక్షను విధిస్తున్నట్టు పేర్కొంది. కర్సానీకి భారతీయ ప్రతినిధులుగా వ్యవహరించిన సాంబశివరావు, మల్లేశం గౌడ్‌ లూ దోషులేనని పేర్కొంటూ వారికీ జరిమానా, జైలుశిక్షను విధించింది. ఇక ఇదే కేసులో ఆరోపణలు వచ్చిన పీవీ మూడో కుమారుడు ప్రభాకర్ రావుపై సరైన ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు విచారణ దాదాపు 23 సంవత్సరాల పాటు జరిగింది. ఓ అవినీతి కేసులో ఇంత భారీ మొత్తాన్ని జరిమానాగా విధించడం ఇదే తొలిసారి.

More Telugu News