KCR: కేసీఆర్ నుంచి ఫోన్ వచ్చిందా? రాలేదా?... టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎడతెగని చర్చ!

  • ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు
  • వనరులు కూడబెట్టుకుని సిద్ధంగా ఉండండి
  • ఫోన్ అందుకోని ఎమ్మెల్యేల్లో ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్ కాల్స్ వెళుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, ముందుగా వచ్చినా, షెడ్యూల్ మేరకు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. సర్వ శక్తులూ కూడదీసుకుని రెడీగా ఉండాలని, ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా చూసుకోవాలని, వనరులను సమీకరించుకోవాలని, పార్టీ తరఫున కూడా సహకరిస్తామని ఆయన చెబుతున్నారు. కేవలం టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి మాత్రమే కాదు. ఇతర పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన వారికి కూడా ఈ ఫోన్లు వస్తున్నాయి. కావాల్సిన నిధులను విడుదల చేయించుకోవాలని, అవసరమైతే మంత్రుల సహకారం తీసుకోవాలని, ఇంకా కావాలంటే తనను కలవచ్చని, పనులు మాత్రం ఆగకుండా చూసుకోవాలని ఆయన చెబుతున్నారు.

గత నాలుగైదు రోజులుగా దాదాపు 70 మందికి ఈ ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తుండగా, కొందరికి కేసీఆర్ ఫోన్లను చేయలేదని తెలుస్తోంది. కేసీఆర్ నుంచి ఫోన్ రానివారందరికీ మరోసారి పోటీ చేసే ఆవకాశం లభించేది డౌటేనని సీనియర్ నేతలు అంటున్నారు. దీంతో ఇంకా ఫోన్ ఎవరెవరికి రాలేదా? అన్న చర్చ మొదలైంది. రానివాళ్లు బయటపడనప్పటికీ, లోలోపల తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి అధికారికంగా, అనధికారికంగా ఎలా చూసినా టీఆర్ఎస్ లో 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఎంతమందికి టికెట్ గ్యారంటీ అన్న విషయంలో ఇంకా స్పష్టత లేనప్పటికీ, పనితీరు ప్రాతిపదికన కొందరికి టికెట్ దక్కకపోవచ్చని సమాచారం.

More Telugu News