Telangana: చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించండి: టీ-మంత్రుల ఆదేశాలు

  • చెరుకు రైతు సమస్యలపై మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సమీక్ష
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు
  • చక్కెర కర్మాగారాల యజమానులకు ఆదేశాలు

చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలని చక్కెర కర్మాగారాల యజమానులకు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఆదేశించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జహీరాబాద్ జిల్లాల పరిధిలోని చెరకు రైతు సమస్యలపై ఈరోజు సమీక్షించారు. రైతులకు చెరకు కర్మాగారాల యజమానులు చెల్లించాల్సిన బకాయిలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో అధికారులతో పాటు చెరుకు కర్మాగారాల యజమానులు పాల్గొన్నారు. చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఫ్యాక్టరీ యాజమాన్యాలను ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల 59 వేల మెట్రిక్ టన్నుల చెరకును ఈ ఫ్యాక్టరీలు వినియోగించాయని, రైతులకు 57 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చామని, ఈ విషయంలో రైతులు ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన హరీశ్ రావు, కేటీఆర్ లు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని, ఈ నెలలో రూ.25 కోట్లు, వచ్చెే నెలలో రూ.32 కోట్లు రెండు విడతలుగా చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు అన్ని వసతులు సమకూర్చుతుంటే, కొందరు ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించడగం తగదని అన్నారు. ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం ఏదైనా ఉంటే తాము అందిస్తామని, రైతులను మాత్రం ఇబ్బంది పెట్టవద్దని చెరుకు ఫ్యాక్టరీ యజమానులను ఆదేశించారు.

More Telugu News