husband: భార్యను చీకటి గదిలో బంధించిన భర్త.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి!

  • ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
  • భార్యను వేధించి, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త
  • గదిలో మహిళను చూసి స్థానికులకు చెప్పిన ఓ చిన్నారి

ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను వేధించి, ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి రెండు నెలల పాటు ఓ చీకటి గదిలో బంధించాడో భర్త.. నీళ్లు, ఆహారం కూడా ఇవ్వకపోవడంతో ఆమె చివరకు ప్రాణాలు కోల్పోయింది. రజియా అనే యువతికి కొన్నేళ్ల క్రితం ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచి ఆమెను భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడు.. పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురాకపోతే ఇంట్లో ఉండకూడదని బెదిరించేవాడు.

చివరకు ట్రిపుల్ తలాక్ చెప్పి, బంధువుల ఇంట్లో ఆమెను వదిలేశాడు. అయినా కొన్ని రోజులకి మళ్లీ ఆమె భర్త దగ్గరకు వచ్చింది. దీంతో ఆమెను భర్త ఓ గదిలో పడేసి చిత్రహింసలు పెట్టాడు. దాదాపు రెండు నెలల తరువాత ఓ చిన్నారి ఈ విషయాన్ని గుర్తించి స్థానికులకు చెప్పింది. దీంతో వారంతా కలిసి రజియాను విడిపించారు.

ఆ వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. తనను భర్త హింసించే వాడని మృతికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో రజియా చెప్పింది. తాను పోలీసులను ఆశ్రయించినా వారు పట్టించుకోలేదని తెలిపింది.

More Telugu News