iran: అలా చేస్తే మీకే నష్టం.. ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్!

  • చబహర్ పోర్టు విస్తరణలో భారత్ మాట తప్పుతోంది
  • ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపేస్తే.. భారత్ కే ఇబ్బంది
  • ట్రంప్ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారు

చబాహర్ పోర్టు విస్తరణకు సంబంధించి ఇచ్చిన మాటను భారత్ తప్పుతోందంటూ ఇరాన్ విమర్శలు గుప్పించింది. ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను ఆపేస్తే... తాము ఇస్తున్న స్పెషల్ ప్రివిలేజ్ (ప్రత్యేక అధికారాలు) హోదాను భారత్ కోల్పోతుందని హెచ్చరించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను ఆపేసి... రష్యా, ఇరాక్, సౌదీ అరేబియాలాంటి దేశాలతో ఆ లోటును పూడ్చుకోవాలని భారత్ భావిస్తే అది పెద్ద తప్పిదమే అవుతుందని ఇరాన్ రాయబారి మసూద్ రెజ్వానియన్ రహాఘి అన్నారు. చబాహర్ పోర్టు విస్తరణ, దానికి సంబంధించిన కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతామన్న హామీని భారత్ ఇంతవరకు పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు.

ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతులను నిలిపివేస్తే... భారతే ఇబ్బందులు పడుతుందని మసూద్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వార్థపూరిత విధానాలతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమెరికా సన్నిహిత దేశాలన్నీ ఇరాన్ నుంచి దిగుమతులను ఆపివేయాలని ట్రంప్ పిలుపు నిచ్చారు. అమెరికాతో సన్నిహితంగా ఉన్న భారత్ కూడా దిగుమతులను నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలోనే భారత్ పై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మరోవైపు, చబహర్ పోర్టు అభివృద్ధి కోసం ఇరాన్, భారత్, ఆఫ్ఘనిస్థాన్ లు ఒప్పందం చేసుకున్నాయి. ఈ పోర్టు ద్వారా ఆయా దేశాల మధ్య రవాణా కారిడార్ ను ఏర్పాటు చేసుకోవాలని తీర్మానించాయి. 

More Telugu News