Harish Rao: అర్ధరాత్రి అడిగినా వాట్సప్‌లో ఫొటోలు పంపుతున్నారు: ఇంజనీర్లపై హరీశ్‌ రావు ప్రశంసల జల్లు

  • ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్ల అవిశ్రాంత కృషి అభినందనీయం
  • అప్పట్లో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్‌ను విస్మరించారు
  • రాష్ట్రాభివృద్ధికి ప్రతీ ఇంజనీర్ పునరంకితం కావాలి
  • ఇంజనీర్స్ డే సందర్భంగా హరీశ్ రావు  

రాష్ట్రంలోని ప్రతి ఇంజనీర్ తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని ఇంజనీర్స్ డే సందర్భంగా మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జలసౌధలో ఈరోజు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ విగ్రహానికి పూల మాల వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురయిన వైతాళికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహుదూర్ అని అన్నారు.

హైదరాబాద్ రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు, అద్భుత కట్టడాల రూపకర్త నవాబ్ అలీ నవాజ్ జంగ్ అని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే నవాజ్ జంగ్‌ జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా ప్రకటించుకున్నామని చెప్పారు. ఆ రోజుల్లో సాంకేతిక ప్రగతి లేకున్నా.. నవాజ్ జంగ్  అద్భుతంగా నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టే ఆ రోజుల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు పొందిందని చెప్పారు.

ఇప్పుడున్న సౌకర్యాలు లేకున్నా.... గుర్రాలపై అక్కడికి వెళ్లి, కుటుంబాలకు దూరంగా ఉంటూ కేవలం టెంట్లలోనే నివసిస్తూ.. ఆ ప్రాజెక్టును అప్పటి ఇంజనీర్లు పూర్తి చేశారని చెప్పారు. ఆయన ప్రాజెక్టులు, కట్టడాలు వంటి వాటికి ఎన్నో రూపకల్పన చేసి, నిర్మించి మోక్ష గుండం విశ్వేశ్వరయ్యకు సమాంతరంగా గొప్ప కీర్తిని గడించారని ప్రశంసించారు.

అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యుత్ శాఖ ఇంజనీర్లు, మిషన్ కాకతీయ, సాగు నీటి శాఖ ఇంజనీర్లు, ఆర్అండ్‌బీ ఇంజనీర్లు, పంచాయతీ ఇంజనీర్లు, అహర్నిశలు పని చేస్తూ... రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారని చెప్పారు.  తమ శాఖలో డిజైన్ ఇంజనీర్లు, జెన్కో ఇంజనీర్లు రూపకల్పన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చూసి సీడబ్ల్యూసీ ఇంజనీర్లు అబ్బురపడుతున్నారని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులోనూ మహిళా ఇంజనీర్లు రాత్రింబవళ్లు పని చేస్తూ... తమ ఇంజనీరింగ్ ప్రతిభను చాటుతున్నారన్నారు. రాత్రి 11.30 గంటలకు సైతం మహిళా ఇంజనీర్లు ప్రాజెక్టు పనుల్లో నిమగ్నయి ఉండటం గొప్ప విషయమన్నారు.

మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద పరిస్థితిని రాత్రి 12 -1 గంట మధ్య వాట్సప్ ద్వారా అడిగితే కూడా ఇంజనీర్లు ఆ సమయంలోనూ అక్కడి తాజా పరిస్థితిని ఫోటోలు తీసి పంపుతున్నారని చెప్పారు. రాత్రింబవళ్లు ఇంజనీర్లు చక్కటి నీటి యాజమాన్య పద్ధతిని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఒక టీఎంసీతో ఆరు వేల ఎకరాలకు నీరు ఇవ్వడమే గగనం అయితే... మన ఇంజనీర్లు సమర్థవంతంగా నిజాం సాగర్ కింద ఒక టీఎంసీతో 13 వేలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు, ఎస్సా రెస్పీ పోచంపాడు కింద  ఒక టీఎంసీతో 11, 500 ఎకరాలకు నీరివ్వడం అభినందనీయమన్నారు.

అన్ అండ్ ఆఫ్ పద్ధతి, టెల్ టూ హెచ్ పద్ధతులను అవలంబించి మన ఇంజనీర్లు ఈ ఘనతను సాధించారని చెప్పారు. ఇది ఓ రికార్డేనన్న ఆయన... ఒకప్పుడు ఇంజనీర్లు అంటే ప్రాజెక్టుల కట్టే వారు మాత్రమే అని అనుకునేవారని, కానీ మన ఇంజనీర్లు  భూసేకరణ వంటి పనులు, ఇతర శాఖల సమన్వయ పనులు సైతం నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.

More Telugu News