Sanju: సంజయ్ దత్ గురించి బాల్ థాకరే నాకు అప్పుడే చెప్పారు: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

  • సంజు సినిమా అద్భుతంగా ఉంది
  • మూడు వ్యవస్థలు ఓ వ్యక్తిని దారుణంగా దెబ్బతీశాయి
  • బాల్ థాకరే నాకు అప్పుడే చెప్పారు

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అమాయకుడని బాల్‌ థాకరే ఒకసారి తనతో చెప్పారని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ‘సంజు’ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాను చూసిన మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత తీవ్ర ఆవేదన చెందానని చెప్పారు. మీడియా, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఒక వ్యక్తిపై ప్రభావం చూపగలవని అర్థమైందన్నారు. ఆటంబాంబు కంటే కలం శక్తి చాలా విధ్వంసం సృష్టిస్తుందని పేర్కొన్నారు.

నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన 30 మంది గాయకులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సంజు’ సినిమా బాగుందని ప్రశంసించారు. మీడియా, పోలీసు, న్యాయవ్యవస్థ కలిసి ఓ వ్యక్తిని ఎంతలా దెబ్బ కొట్టగలవో ఈ సినిమాలో చూపించారన్నారు. ఇవి మూడు కలిసి సునీల్ దత్, ఆయన కుమారుడు సంజయ్ దత్ జీవితాలను ఛిద్రం చేశాయన్నారు. ఈ సందర్భంగా గతంలో శివసేన చీఫ్ బాల్ థాకరే తనతో అన్న మాటలను మంత్రి గుర్తు చేసుకున్నారు. ‘‘దివంగత శివసేన చీఫ్ బాల్ థాకరే ఒకసారి నాతో మాట్లాడుతూ సంజయ్ దత్ పూర్తిగా అమాయకుడు. అందుకే నేనెప్పుడూ చెబుతుంటాను, దేని గురించైనా, ఎవరి గురించైనా రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని’’ అని అన్నారని మంత్రి గుర్తు చేసుకున్నారు.

More Telugu News