EAMCET: ఎంసెట్ స్కామ్ తమకు తెలియదంటున్న శ్రీ చైతన్య యాజమాన్యం... కోర్టులో తేల్చుకోవాలన్న సీఐడీ!

  • 2016లో ఎంసెట్ స్కామ్
  • పట్టుబడిన 104 మంది విద్యార్థుల్లో 80 మంది శ్రీచైతన్య వాళ్లే
  • చార్జ్ షీట్ లో శ్రీ చైతన్య యాజమాన్యం పేర్లు

2016లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎంసెట్ స్కామ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేయాలని నిర్ణయించిన సీఐడీ, అందులో శ్రీచైతన్య జూనియర్ కళాశాలల యాజమాన్యాన్ని కూడా చేర్చింది. శ్రీ చైతన్య ఆరు కళాశాలలకు చెందిన డీన్ ఈ కేసులో నిందితుడిగా ఉండటం, ముందే ప్రశ్నాపత్రాన్ని తెలుసుకున్న విద్యార్థుల్లో అత్యధికులు ఆ కళాశాలకు చెందిన వారే కావడంతో, డైరెక్టర్ల పేర్లను సీఐడీ పోలీసులు చార్జ్ షీట్ లో చేర్చారు. ఈ స్కామ్ లో ఇప్పటివరకూ 104 మంది విద్యార్థుల ప్రమేయం ఉందని గుర్తించిన సీఐడీ, వీరిలో 80 మంది శ్రీ చైతన్య విద్యార్థులేనని గుర్తించింది. మరో 14 మంది నారాయణ కాలేజ్ కి చెందిన వారని, మిగతా వారు ఇతర కాలేజీల వారని సీఐడీ తన చార్జ్ షీట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

స్కామ్ లో భాగంగా చేతులు మారిన డబ్బులో ఇప్పటివరకూ రూ. 5 కోట్లను స్వాధీనం చేసుకున్నామని సీఐడీ పేర్కొంది. ఈ కుంభకోణంలో తమ ప్రమేయం ఏమీ లేదని, అది కొన్ని కాలేజీలను పర్యవేక్షిస్తున్న వ్యక్తి చేసిన నేరమేనని, తమ కాలేజీల్లో అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని శ్రీ చైతన్య యాజమాన్యం చెబుతోంది. ప్రమేయం ఉందో లేదో కోర్టు విచారణలో తేలుతుందని, కాలేజీల యాజమాన్యం విచారణను ఎదుర్కోవాల్సిందేనని సీఐడీ అధికారులు తేల్చిచెబుతున్నారు.

More Telugu News