pulivendula: పులివెందులలో వైసీపీ నేతను నరికి చంపిన ప్రత్యర్థులు!

  • పులివెందులలో రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్న రంగేశ్వర్ రెడ్డి
  • స్వగ్రామం దిద్దికుంటలో ఫ్యాక్షన్ గొడవలు
  • సుమోల్లో వచ్చి, నరికి చంపి, పరారైన ప్రత్యర్థులు

కడప జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య కలకలం రేపింది. సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన వైసీపీ నేత రంగేశ్వర్ రెడ్డి (45) పులివెందులలో నివాసం ఉంటున్నారు. నిన్న రాత్రి ప్రత్యర్థులు ఆయనను కిరాతకంగా హత్య చేశారు. పులివెందుల ఆటోనగర్ లో నివాసం ఉంటున్న ఆయనను ఇంటి సమీపంలోనే మట్టుబెట్టారు. వేటకొడవళ్లతో నరికి, దారుణంగా హత్య చేవారు. తల, మెడ, ఛాతీ భాగంలో బలమైన గాయాలు కావడంతో... ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

దిద్దెకుంట గ్రామంలో ఫ్యాక్షన్ గొడవలు ఉండటంతో... గత కొన్నేళ్లుగా తన కుటుంబంతో కలసి రంగేశ్వర్ రెడ్డి పులివెందులలో ఉంటున్నారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో తన ఇంటి వద్ద ఫోన్ లో మాట్లాడుతుండగా... ప్రత్యర్థులు దాడి చేశారు. రెండు సుమో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు విచక్షణారహితంగా నరికి చంపారు. దాడి చేసిన వెంటనే ప్రత్యర్థులు సుమోల్లో పరారయ్యారు. బయట అరుపులు వినిపించడంతో, కుటుంబసభ్యులు పరుగున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆయన నిర్జీవంగా, రక్తపు మడుగులో పడి ఉన్నారు.

మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రి 10 గంటల సమయంలో ఘటనాస్థలికి చేరుకుని, పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేపట్టారు. హత్యకు కారణం వ్యాపార గొడవలా? లేక గ్రామంలోని ఫ్యాక్షన్ గొడవలా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పులివెందులలో రంగేశ్వర్ రెడ్డి రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 

More Telugu News