Madhya Pradesh: వీళ్లు వై‌ద్యులేనా? పురిటి నొప్పులతో గర్భిణి అల్లాడిపోతుంటే.. బర్త్‌డే వేడుకల్లో ఎంజాయ్!

  • పురిటి నొప్పులతో ఆసుపత్రికి గర్భణి
  • బర్త్ డే వేడుకల్లో వైద్యులు బిజీ
  • గంట సేపు ఎదురు చూసినా పట్టించుకోని వైద్యులు

పురిటి నొప్పులతో గర్భిణి ఆసుపత్రి బెడ్‌పై అల్లాడిపోతుంటే వైద్య సిబ్బంది ఆమె ఎదురుగానే బర్త్ డే వేడుకల్లో మునిగిపోయారు. నొప్పులతో కేకలు పెడుతున్నా వైద్యుల మనసు కరగలేదు సరికాదా.. వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటూ కసురుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లా ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వ‌చ్చి వైరల్ అయింది. వైద్యుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి తీరుపై విమర్శలు రావడంతో స్పందించిన సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ఘటనపై విచారణ జరిపించనున్నట్టు చెప్పారు.

బాధితురాలి భర్త శ్రీరామ్ యాదవ్ కథనం ప్రకారం.. నిండు గర్భిణి అయిన తన భార్య గుంతా యాదవ్‌ను తీసుకుని ఈ నెల 7న ఆసుపత్రికి వచ్చాడు. ఓపీ రాయించుకున్నాక లోపలికి వెళితే అక్కడ బర్త్ డే వేడుకల్లో వైద్యులు మునిగిపోయి ఉన్నారు.  ధైర్యం చేసి వారి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. దీంతో విసుక్కున్న వైద్యులు తాము వేడుకల్లో ఉన్నామని, ఆమెను మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని కాస్తంత గట్టిగానే చెప్పారు.

అయితే, అప్పటికప్పుడు ఎక్కడికి తీసుకు వెళ్లాలో తెలియక గంటపాటు అక్కడే వేచి చూశానని, అయినా, వారి మనసు కరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చివరికి తన భార్యను రక్షించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు చెప్పాడు. అయితే, అంతకంటే ముం‌దు వైద్యుల బర్త్ డే పార్టీని వీడియో తీసి సీఎం హెల్ప్ లైన్‌కు పంపినట్టు శ్రీరామ్ వివరించాడు.

More Telugu News