Kathi Mahesh: కత్తి మహేష్ పై కఠిన చర్యలు డిమాండ్ చేస్తూ, యాదగిరిగుట్టకు పరిపూర్ణానంద పాదయాత్ర!

  • శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్
  • బషీర్ బాగ్ నుంచి యాదాద్రికి పాదయాత్ర చేస్తానన్న పరిపూర్ణానంద
  • కత్తిని దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్

హిందువులకు ఆదర్శవంతుడైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, అతనిని దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పాదయాత్రను ప్రకటించారు. హైదరాబాద్ బషీర్ బాగ్ లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై రెండు రోజుల పాటు నడిచి యాదాద్రికి వెళ్లనున్నామని, అక్కడి లక్ష్మీ నరసింహస్వామికి తమ గోడును వెళ్లబోసుకోనున్నామని అన్నారు.

'ధర్మాగ్రహం' పేరిట యాత్ర జరుగుతుందని, ప్రతి హిందువూ యాత్రలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రెండు రోజుల్లో కత్తి మహేష్ పై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే తన భవిష్యత్తు కార్యాచరణను యాదాద్రిపై ప్రకటిస్తానని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలతో హిందువులను మనోవేదనకు గురి చేసిన ఆయన్ను జైల్లో పెట్టాల్సిందేనని అన్నారు. కాగా, పరిపూర్ణానంద చేపట్టిన యాత్రకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నట్టు నటుడు నాగబాబు వెల్లడించారు.

More Telugu News