Balka suman: ఆరోపణలు రుజువు చెయ్యండి.. ట్యాంక్ బండ్‌పై ఉరేసుకుంటా: ఎంపీ బాల్క సుమన్

  • ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరి
  • కుటుంబంతో నేను దిగిన ఫొటోను మార్ఫింగ్ చేశారు
  • ఎంపీపై  ఆరోపణల్లో నిజం లేదన్న సీఐ

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను రుజువు చేస్తే ఉరి వేసుకోవడానికి సిద్ధమని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ సవాలు విసిరారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని అన్నారు. ప్రాణ త్యాగానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలు నిరూపిస్తే ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరేసుకుంటానన్నారు.

మంచిర్యాలకు చెందిన బోయిని సంధ్య, బోయిని విజేతలు అక్కాచెల్లెళ్లని సుమన్ పేర్కొన్నారు. సంధ్య తనను మోసం చేయాలని ఆరు నెలల క్రితమే ప్లాన్ చేసిందని అన్నారు. తాను భార్య, కుమారుడితో కలిసి దిగిన ఫొటోలో తన భార్య స్థానంలో సంధ్య ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసిందని సుమన్ ఆరోపించారు. తనను బ్లాక్ మెయిల్ కూడా చేసిందన్నారు. ఈ ఏడాది జనవరి 27నే ఆమెపై ఫిర్యాదు చేసినట్టు సుమన్ వివరించారు. బ్లాక్ మెయిల్ నేరంపై ఫిబ్రవరి 6న వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో కూడా హాజరు పరిచారని ఎంపీ గుర్తు చేశారు. మళ్లీ ఇటీవల ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మరోమారు తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని, దీంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని సుమన్ తెలిపారు.  

మరోవైపు సుమన్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని మంచిర్యాల సీఐ మహేశ్ తెలిపారు. బాధితులుగా చెబుతున్న సంధ్య, విజేతలు చూపిస్తున్న ఆధారాల్లో నిజం లేదన్నారు. ఫొటోను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడినట్టు విచారణలో తేలిందని సీఐ పేర్కొన్నారు.

More Telugu News