kanna lakshminarayana: కన్నాపై చెప్పు విసిరిన వ్యక్తిపై దాడి చేసిన బీజేపీ నేతలపై కేసు నమోదు!

  • కన్నాపై చెప్పు విసిరిన లారీ యజమాని మహేశ్వరరావు
  • చితకబాదిన బీజేపీ నేతలు, కార్యకర్తలు
  • కావలి ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితుడు

నెల్లూరు జిల్లాలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై లారీ యజమాని గొర్రెపాటి మహేశ్వరరావు చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మహేశ్వరరావుతో పాటు, ఆయనపై దాడి చేసిన బీజేపీ నేతలపై కూడా కేసు నమోదైంది. కన్నాపై చెప్పు విసిరాడంటూ తొలుత బీజేపీ నేతలు మహేశ్వరరావుపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేశ్వరరావు... బీజేపీ నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేసి, గాయపరిచారంటూ కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులపై కూడా కేసు నమోదైంది.

ఈ సందర్భంగా మహేశ్వరరావు మాట్లాడుతూ, లారీ యజమానిగా తాను పడుతున్న ఇబ్బందులు గుర్తుకువచ్చి, ఆగ్రహంతో కన్నాపై చెప్పు విసిరానని చెప్పాడు. ఉద్దేశపూర్వకంగా తాను ఆ పని చేయలేదని తెలిపాడు. పోలీసులు అడ్డుకుంటున్నా బీజేపీ నాయకులు, కార్యకర్తలు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పాడు. తనపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. కావలిలోని ఏరియా ఆసుపత్రిలో మహేశ్వరరావు వైద్యచికిత్స పొందాడు. 

More Telugu News