Gambling: క్రికెట్ బెట్టింగ్ ను చట్టబద్ధం చేయండి... ఖజానాకు ఆదాయం వస్తుందంటూ లా కమిషన్ సంచలన సిఫార్సులు

  • మొత్తం బెట్టింగ్ ఆన్ లైన్ లావాదేవీల ద్వారానే
  • ఆధార్ కార్డు, పాన్ కార్డు అనుసంధానం తప్పనిసరి
  • కేంద్రానికి లా కమిషన్ రిపోర్టు

గ్యాంబ్లింగ్ ను, క్రికెట్ వంటి క్రీడల్లో బెట్టింగ్ ను చట్టబద్ధం చేయాలని, తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని లా కమిషన్ సంచలన సిఫార్సులు చేసింది. ఈ తాజా సిఫార్సుల ప్రకారం, గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించి, నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలని, దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయని లా కమిషన్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.

ఇక ఇదే సమయంలో ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలని, డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలని కూడా సిఫార్సు చేసింది. ఈ మేరకు 'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వగా, దీనిపై పార్లమెంట్ లో చర్చ జరగనుందని తెలుస్తోంది.

అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది.

More Telugu News