Hyderabad: ఆరు రోజుల శిశువును అపహరించిన బీదర్ మహిళ ఎవరో కనిపెట్టేసిన పోలీసులు... అరెస్ట్!

  • బీదర్ లో గత రాత్రి నైనా అరెస్ట్
  • హైదరాబాద్ కు తీసుకు వస్తున్న పోలీసులు
  • పెంచుకుందామనే బిడ్డను తీసుకెళ్లినట్టు విచారణలో వెల్లడి

హైదరాబాద్‌, సుల్తాన్‌ బజార్‌ లోని ప్రసూతి ఆసుపత్రి నుంచి ఆరు రోజుల శిశువును ఎత్తుకెళ్లిన మహిళను బీదర్ లో గుర్తించిన పోలీసులు ఆమెను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఆమె పేరు నైనా అని, వయసు 25 సంవత్సరాలని, భర్తతో కలసి బీదర్ లోని షాగంజ్ ప్రాంతంలో నివసిస్తోందని తెలిపారు. ఆమెను హైదరాబాద్ కు తీసుకు వస్తున్నామని అన్నారు.

తనకు రెండుసార్లు అబార్షన్ కావడంతో ఆ చిన్నారిని పెంచుకునేందుకే తీసుకు వెళ్లినట్టు నైనా ప్రాథమిక విచారణలో వెల్లడించినట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఆమె భర్త సైమన్ పండ్ల వ్యాపారం చేస్తుంటాడని, ఎలాగైనా తల్లిని కావాలన్న ఉద్దేశంతో గత శుక్రవారం నాడు హైదరాబాద్ కు వచ్చి, రెండు, మూడు ఆసుపత్రులు తిరిగి, ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని, అక్కడ సుజాత జన్మనిచ్చిన శిశువును అపహరించిందని వెల్లడించారు.

కాగా, కిడ్నాప్ జరిగిన గంటల వ్యవధిలోనే ఆమె బీదర్ బస్సు ఎక్కడం, బీదర్ కు పోలీసు బృందాలు వెళ్లడం, టీవీ చానళ్లలో కిడ్నాప్ వార్త ప్రముఖంగా వస్తుండటంతో నైనా ఆ చిన్నారిని బీదర్ లోని ఓ ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే.

More Telugu News