ATM: తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలు ఇకపై రాత్రి వేళ బంద్?

  • ఉదయం 5లోపు 5 కన్నా తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంల మూత
  • బ్యాంకర్ల సమావేశంలో పోలీసుల సూచన
  • త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న బ్యాంకర్లు

  రాత్రి 11 గంటల తరువాత జనసంచారం లేని ప్రాంతాల్లో, ఉదయం 5 గంటల్లోపు 5 కన్నా తక్కువ లావాదేవీలు నమోదయ్యే ఏటీఎం కేంద్రాలను ఇకపై ఆ సమయాల్లో మూసివేయాలని సైబరాబాద్ బ్యాంకర్లు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఏటీఎంల నిర్వహణా భారం పెరగడం, తక్కువ లావాదేవీలు జరుగుతూ ఉండటంతో రాత్రి వేళల్లో నిరుపయోగంగా ఉన్న ఏటీఎం సెంటర్లను డీలింక్ చేయాలని పోలీస్ కమిషనరేట్ లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో పోలీసులు చేసిన సూచనకు బ్యాంకర్లు సమ్మతించారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధాన కార్యాలయాలు తీసుకుంటాయని, విషయాన్ని హెడ్డాఫీస్ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సైబర్ నేరాలను నియంత్రించడానికి రాత్రివేళల్లో ఏటీఎంలను పూర్తిగా మూసివేయాలని పోలీసు అధికారులు సూచించారు. రాత్రిపూట 5 కన్నా తక్కువ లావాదేవీలు జరిగే ఏటీఎంలలో 95 శాతం మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ ఏటీఎంలపై క్లోనింగ్ ముఠాలు కన్నేశాయని, వీటిల్లో స్కిమ్మర్లు, కెమెరాలు ఏర్పాటు చేసి కార్డుల వివరాలు తస్కరిస్తున్నాయని గుర్తు చేసిన అధికారులు వీటిని మూసేస్తేనే మంచిదని స్పష్టం చేశారు. తద్వారా నేరాలకు ఆస్కారం లేకుండా చూడవచ్చన్న పోలీసుల ఆలోచనను ప్రధాన కార్యాలయాల దృష్టికి తీసుకెళ్లి, అనుమతి రాగానే అమలు చేస్తామని బ్యాంకర్లు ప్రకటించారు.

More Telugu News