Madhya Pradesh: 'నీ ప్రేమ నిజమైనదైతే తుపాకితో కాల్చుకో'మన్న ప్రియురాలి తండ్రి.. నిజంగానే తుపాకీతో కాల్చుకుని యువకుడి మృతి

  • భోపాల్‌లోని అరోరా మండలంలో ఘటన
  • బ్యాంక్‌ ఉద్యోగినిని ప్రేమించిన యువకుడు
  • పెళ్లికి ఒప్పుకోని అమ్మాయి తండ్రి
  • మరో జన్మంటూ ఉంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఉందన్న ప్రియుడు

'నీ ప్రేమ నిజమైనదైతే కాల్చుకుని నీ ప్రేమను నిరూపించుకో' అని తన ప్రియురాలి తండ్రి తనతో అనగా ఓ యువకుడు నిజంగానే తుపాకీతో కాల్చుకుని మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని అరోరా మండలంలో చోటు చేసుకుంది. బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న అతుల్‌ లఖండే అనే యువకుడు, ఆ ప్రాంతంలోనే ఉండే ఓ బ్యాంక్‌ ఉద్యోగిని ప్రేమించుకుంటున్నారు.

అయితే, వారి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించి, ఆ ప్రాంతాన్ని వదిలేసి ఎంపీనగర్‌లో నివాసముంటున్నారు. తాజాగా ఆ అమ్మాయి ప్రేమికుడు అతుల్‌ మళ్లీ తన ప్రియురాలి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి నీ ప్రేమ నిజమైతే, నీది ఆకర్షణ, మోజు కాకపోతే తుపాకితో కాల్చుకుని నీ ప్రేమను నిరూపించుకో అని అన్నాడు. ఒకవేళ కాల్చుకున్నా బతికితే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. మృతి చెందితే వచ్చే జన్మలో తన కూతురిని పెళ్లి చేసుకోమని ఉచిత సలహా ఇచ్చి పంపించాడు.

ఇంటికెళ్లిపోయిన అతుల్‌ తనను తాను కాల్చుకొని తన ప్రేమను నిరూపించుకుంటానని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ఆమె లేని జీవితం తనకు వద్దని, దయచేసి ఆమెను ఎవరూ నిందించకండని, మరో జన్మంటూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉందని పోస్ట్ చేసి, ఆమెతో గతంలో దిగిన 40 ఫోటోలను కూడా పోస్ట్‌ చేశాడు. అనంతరం నిన్న రాత్రి తన ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతుల్‌.. తుపాకి తీసి తనకి గురి పెట్టుకుని కాల్చుకుని చనిపోయాడు.

More Telugu News