Jana Reddy: సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పే: కత్తి మహేశ్ వ్యాఖ్యలపై జానారెడ్డి

  • కత్తి మహేశ్ వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన
  • కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి
  • ఆందోళనలు కలిగించేలా మాట్లాడటం క్షమించరాని విషయం  

కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని, సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరాని విషయమని అన్నారు. కత్తి మహేశ్ లాంటి వారు చేసే వ్యాఖ్యలు కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి వార్తలు ప్రచురించే సమయంలో జర్నలిస్టులు సంయమనం పాటించాలని, అసహ్యమైన వ్యాఖ్యలు ప్రచురించకూడదని సూచించారు.

 కాగా, తెలంగాణలో రేషన్ డీలర్ల విషయాన్ని ఈ సందర్భంగా జానారెడ్డి ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగొచ్చినందుకు అభినందిస్తున్నామని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసం తీసుకొచ్చిన ‘రైతు బంధు పథకం’ లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. ప్రభుత్వం వద్ద సరైన లెక్కలు లేకపోవడంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతోందని, నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని, అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జానారెడ్డి డిమాండ్ చేశారు.

More Telugu News