Yadadri Bhuvanagiri District: యాదగిరి గుట్ట పనులను వేగంగా పూర్తి చేయాలి: తెలంగాణ సీఎస్

  • దేవాలయ పరిధిలో కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం
  • రాయగిరి గండి ఇరిగేషన్ చెరువుల సుందరీకరణ
  • రాయగిరి వద్ద ఆర్‌ఓబీ నిర్మాణం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పరిధిలో చేపడుతోన్న వివిధ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఆదేశించారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ (వైటీడీఏ) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌.కె జోషి మాట్లాడుతూ... దేవాలయ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి కావాలని, కాటేజీలు, విల్లాలు, ప్లాట్ల నిర్మాణం, రాయగిరి గండి ఇరిగేషన్ చెరువుల సుందరీకరణ, రాయగిరి వద్ద ఆర్‌ఓబీ నిర్మాణం, తదితర పనులను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం పనులన్నీ ప్రణాళిక ప్రకారం పూర్తికావాలన్నారు. వేద పాఠశాల నిర్మాణానికి అవసరమైన చోట ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

More Telugu News