Tollywood: నా అంతట నేనే చెబితే ఇంత రాద్ధాంతమా?: అమెరికాలో హీరోయిన్ల వ్యభిచారంపై మరోసారి మెహ్రీన్

  • మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ ఓ పత్రికలో కథనం
  • తాను ఎటువంటి ఇంటర్వ్యూనూ ఇవ్వలేదని స్పష్టం చేసిన మెహ్రీన్
  • అవాస్తవాలు ప్రచారం చేయవద్దని వినతి

వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్న తనను అమెరికా సరిహద్దు భద్రతాధికారులు విచారించారని, వారి నోటి నుంచే టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్ రాకెట్ పై తొలిసారి సమాచారం విన్నానని గతంలో చెప్పిన హీరోయిన్ మెహ్రీన్, మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయమై ఇంకాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ఇటీవల 'పంతం' ప్రమోషనల్ ఈవెంట్ లో హీరోయిన్ల వ్యభిచారంపై మెహ్రీన్ సంచలన వ్యాఖ్యలు చేసిందంటూ ఓ పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా, మెహ్రీన్ దాన్ని ఖండించింది. "ఈ కథనం పూర్తి అవాస్తవం. నేను ఆ ఇంటర్వ్యూను ఇవ్వలేదు. మీడియాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అసలు 'పంతం' ప్రమోషన్ కార్యక్రమంలో నేను పాల్గొనలేదు. ఆ సమయంలో వైరల్ ఫీవర్ తో ముంబైలో ఉన్నాను" అని చెప్పుకొచ్చింది.

"యూఎస్ఏలో ఏం జరిగిందో మరోసారి నిజం చెబుతున్నాను. నేను నా కుటుంబంతో కలసి వీకెండ్ హాలిడే కోసం వాంకోవర్ నుంచి లాస్ వెగాస్ వెళుతున్నాను. ఇమిగ్రేషన్ చెకింగ్ సమయంలో నేను తెలుగు సినిమాల్లో నటినని వారికి తెలిసింది. అప్పుడు వారు నన్ను అమెరికాలో ప్రయాణానికి కారణాలేంటని అడిగారు. సెక్స్ స్కాండల్ గురించి చెప్పారు. ఆ విషయాన్ని తొలిసారిగా విన్నది అప్పుడే. వ్యభిచారంతో నాకు సంబంధం లేదని తెలుసుకుని క్షమాపణలు చెప్పి పంపించారు. ఆపై నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. ఈ విషయాన్ని నేనే బహిరంగ పరిచాను. మరెవరైనా ఈ విషయంపై అవాస్తవాలు ప్రచారం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ పని చేశాను. ఆ సమయంలో నా పరిస్థితికి నేను సిగ్గుపడ్డాను. వణికిపోయాను కూడా" అని వ్యాఖ్యానించింది. టాలీవుడ్ హీరోయిన్ల సెక్స్  రాకెట్ లో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేసే ప్రయత్నం చేసింది.

More Telugu News