Kathi Mahesh: కత్తి మహేష్ ను పంపించి వేసిన పోలీసులు... ఫేస్ బుక్ లో మరో పోస్టుతో కలకలం రేపిన కత్తి!

  • శ్రీరాముడుని నిందించాడన్న ఆరోపణలపై విచారణ
  • మరోసారి రావాలని నోటీసు ఇచ్చి పంపేసిన పోలీసులు
  • ఫేస్ బుక్ లో తన వ్యాఖ్యలను సమర్థించుకున్న కత్తి

శ్రీరాముడుని నిందించాడన్న ఆరోపణలపై కత్తి మహేష్ ను గత రాత్రి విచారించిన పోలీసులు, అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి వుంటుందని చెబుతూ నోటీసులు ఇచ్చి ఆయన్ను పంపించి వేశారు. విచారణకు సహకరించాలని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించి పంపారు. ఆపై కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ "కేసుకు సంబంధించిన వివరాలు అడిగారు. చెప్పాను. ఇప్పుడు వివరణ కోరుతూ నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ కి సహకరించమని కూడా నోటీస్ లో ఉంది. అంతే. ఇకపైన మిగతా విషయాలు చూడాలి" అని అన్నాడు. అంతటితో ఆగకుండా, రామాయణం, యుద్ధకాండలో రాముడు సీతను ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన కొన్ని వాక్యాలను పోస్టు చేశాడు.

"సద్వంశంలో పుట్టినవాడు పౌరుషవంతుడయితే, పరగృహంలో ఉండిన భార్యను ఆనందంతో ఎవడు స్వీకరించగలడు. ఇంత కాలానికి నువ్వు రావణుని ఒడిలోనుండి దిగివచ్చావు. వాడు నిన్ను దుశ్చింతతో చూసాడు. ఇక నా కులం పాడుచేసుకుని నిన్నెలా స్వీకరిస్తాను? పోయిన కీర్తి మళ్లీ తెచ్చుకోవడానికి నిన్ను సాధించాను. నాకు నీయెడల ఆసక్తి లేశమూ లేదు. యథేచ్ఛగా వెళ్లిపో. ఇది నేను దృఢ నిశ్చయంతో చెప్పినమాట కానీ వేళాకోళం కాదు.

కనుక లక్ష్మణుని దగ్గరకో, భరతుని దగ్గరకో, వానరేంద్రుడైన సుగ్రీవుని దగ్గరకో, రాక్షసేన్ద్రుడయిన విభీషణుని దగ్గరకో వెళ్లి కాలం గడుపుకో. నువ్వు చక్కని దానవు. నాగరికత కలదానవు. వంట ఇల్లు జొచ్చిన కుందేలులాగా తన ఇంట్లో ఉన్నదానవు. సహజంగా దుష్టుడయిన రావణుడు నిన్ను విడిచిపెట్టి ఉండడు" అని చాలా కఠినంగా చెప్పాడు. లాలనపాలనలు ఎదురుచూస్తూ ఉన్న సీత ఇది విని ఏనుగు చేతచిక్కిన సల్లకీలతలాగా వడవడ వొణికిపోతూ కన్నీరు విడిచింది" అని 'మనసు ఫౌండేషన్' ప్రచురించిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య రచనల సంకలనం మూడవ సంపుటంలోని వాక్యాలను కోట్ చేశాడు.

ఆపై "సీతను రావణుని దగ్గరకే తిరిగి వెళ్ళిపొమ్మన్నది సాక్షాత్తు సీత భర్తయిన శ్రీరాముడే. ఆ తరువాతే మణిరత్నం అయినా, బాబు గోగినేని అయినా లేదా నేనైనా అన్నది" అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.

More Telugu News