New Delhi: బురారీ మిస్టరీ: తాంత్రికుడు జనేగడి కోసం పోలీసుల వేట

  • తాంత్రిక బాబా కోసం రంగంలోకి పోలీసులు
  • వారిది ఆత్మహత్య కాదంటున్న బంధువులు
  • ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అనుమానం

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మిస్టరీగా మారిన ఈ ఆత్మహత్యలకు గల కారణాన్ని పోలీసులు శోధిస్తున్న కొలదీ విస్తుగొలిపే విషయాలు బయటకొస్తున్నాయి. కాగా, వారిది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్‌తోనే వారిని ఎవరో హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాంత్రిక పూజలు నిర్వహించారనే వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తమది చాలా సంతోషకరమైన కుటుంబమని, తాంత్రికులను నమ్మే అలవాటు తమకు లేదని చెబుతున్నారు. ఎవరో వారిని చంపేసి ఆ నెపాన్ని తాంత్రిక పూజలవైపు మళ్లించారని ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబం బంధువు సుజాత తెలిపారు.

మరోవైపు, ఆత్మహత్యలకు పురిగొల్పిన తాంత్రిక బాబా జనేగడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు. అతడు కనుక చిక్కితే ఈ కేసులో చిక్కుముడి దాదాపు వీడుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీ వారికి క్షుద్రపూజలపై అచంచల విశ్వాసం ఉన్న విషయాన్ని తెలియజేస్తోందని పోలీసులు చెబుతున్నారు . తాంత్రికుడు దొరికితే ఈ కేసు మొత్తం ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. దీంతో అతడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

More Telugu News