Siddipet District: తమ్ముడి మృతదేహాన్ని చూసి కుప్పకూలి మరణించిన బాలిక.. సిద్దిపేటలో విషాదం!

  • అనారోగ్యంతో తమ్ముడి మృతి
  • తట్టుకోలేక మృతి చెందిన అక్క
  • గంటల వ్యధిలోనే ఘటన
  • విషాదంలో గ్రామం

అనుబంధాలకు, ప్రేమ, ఆప్యాయతలకు వయసు తారతమ్యం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేలు మండలంలోని జాలిగామకు చెందిన పదేళ్ల బాలిక నిరూపించింది. తమ్ముడితో పెంచుకున్న అనుబంధాన్ని మృత్యువు కూడా విడదీయలేకపోయింది. తమ్ముడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేని ఆ చిన్ని గుండె ఆగిపోయింది. గ్రామం మొత్తాన్ని కన్నీటి సంద్రంలో ముంచిన తోబుట్టువుల మృతికి చెందిన మరిన్ని వివరాలు..

జాలిగామకు చెందిన పుప్పాల పద్మ-స్వామి దంపతులకు సోను ప్రియ (10), ప్రదీప్ (5) సంతానం. ఆదివారం ప్రదీప్‌ అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. సోమవారం పరిస్థితి మరింత విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రదీప్ మృతి చెందాడు. దీంతో చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

అప్పటికి నిద్రలో ఉన్న సోనుప్రియ వారి ఏడుపులు విని నిద్ర లేచింది. బయటకు వచ్చి తమ్ముడి మృతదేహాన్ని, రోదిస్తున్న తల్లిదండ్రులను చూసి ఆ చిన్నారి తట్టుకోలేకపోయింది. అక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలింది. విషయం తెలిసిన గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది.

More Telugu News